Sidebar


Welcome to Vizag Express
జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు

16-01-2025 21:19:27

జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు -2025 పోస్టర్లను, కరపత్రాలను విడుదల చేసిన  జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి

అనకాపల్లి, ఎక్స్ ప్రెస్ న్యూస్ జనవరి 16 :                 జిల్లాలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలను పకడ్బందీగా, చిత్తశుద్ధితో నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. జాహ్నవి  అధికారులను ఆదేశించారు. గురువారం   కలెక్టర్ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలపై రవాణా, పోలీసు శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు- 2025 పోస్టర్లను, కరపత్రాలను విడుదల చేశారు.

ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ ఎం.జాహ్నవి మాట్లాడుతూ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాలు చాలా ముఖ్యమైనవన్నారు. ప్రమాదాల వల్ల ఒక ప్రాణాన్ని పోగొట్టుకున్నా తిరిగిరాని పరిస్థితి ఉందని, ఇతరుల పొరపాటు వల్ల ప్రాణాలు కోల్పోవచ్చని, ప్రమాదాలు జరుగకుండా సురక్షిత డ్ర్రైవింగుపై అందరికీ విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. రహదారి భద్రత కార్యక్రమాలు ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా చేపట్టాలన్నారు. జిల్లాలో జనవరి 16వ తేదీ నుంచి ఫిబ్రవరి 15వతేదీ వరకు జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఈనెల 17వ తేదీన రహదారి భద్రతపై అవగాహన కల్పించేందుకు స్వచ్ఛంద సంస్థలు, డ్రైవింగ్ స్కూల్ ఇన్స్ట్రక్టర్స్, రిటైర్డ్ ఏపీఎస్ఆర్టీసీ సిబ్బంది తో వాలంటీర్లను గుర్తించి వారికి శిక్షణ ఇవ్వాలన్నారు. ఈనెల 18 నుంచి 21వ తేదీ వరకు మద్యం సేవించి వాహనం నడపే వారిని గుర్తించడం, అధిక వేగంతో నడిపే వాహనాలను స్పీడ్ గన్ తో గుర్తించడం, హెల్మెట్ లేకుండా, సీట్ బెల్ట్ లేకుండా వాహనం నడపడం, సెల్ ఫోన్ డ్రైవింగ్ మొదలైన వాటిపై ప్రత్యేక డ్రైవ్  చేపట్టాలన్నారు. ఈనెల 22 నుంచి 23వ తేదీ వరకు జిల్లాలో జాతీయ, రాష్ట్ర రహదారులలో గుర్తించిన బ్లాక్ స్పాట్లలో జాయింట్ ఇన్స్పెక్షన్ చేయడం చేసి అక్కడ తగిన భద్రతా చర్యలు చేపట్టడం చేయాలన్నారు. అనకాపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కూడా బ్లాక్ స్పాట్లలో పరిశీలన చేయాలన్నారు. ఈనెల 24వ తేదీన డ్రైవర్లకు హెల్త్ చెకప్ చేయించడం, 25వ తేదీన అవగాహన కార్యక్రమాలు చేపట్టడం, 26,27వ తేదీలలో ప్రజాప్రతినిధులను భాగస్వామ్యం చేసి వాకథాన్ లు నిర్వహించడం, 30, 31వ తేదీలలో బైక్ ర్యాలీలు నిర్వహించడం లాంటి కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇలా వచ్చే నెల 15వ తేదీ వరకు రహదారి భద్రత మాసోత్సవాలలో పలు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రమాదాలను నివారించేందుకు చర్యలు తీసుకోవాలని, ఇందుకు అధికారులంతా చిత్తశుద్ధితో పని చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా రవాణా శాఖ అధికారి జి. మనోహర్, అనకాపల్లి ట్రాఫిక్ పోలీస్ స్టషన్ సర్కిల్ ఇన్ స్పెక్టర్ ఎం వెంకట నారాయణ, మోటార్ వెహికల్, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, రవాణా, పోలీస్, శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.