రాష్ట్ర శకటానికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం రావడం గర్వ కారణం
-పార్లమెంట్ సభ్యులు సిఎం రమేష్
-ఏటికొప్పాక లక్క బొమ్మ అంటే కేవలం అందమే కాదు అనకాపల్లి జిల్లా ప్రజల సెంటిమెంట్
-రిపబ్లిక్ డే పెరేడ్ ఉత్సవాలకే హైలెట్గా నిలిచిన ఏటికొప్పాక శకటం
-ఏపీ ప్రదర్శించిన ఏటికొప్పాక బొమ్మల శకటానికి మూడోస్థానం
యలమంచిలి-వైజాగ్ ఎక్స్ ప్రెస్, జనవరి 29:
దేశ రాజధాని ఢిల్లీలోని కర్తవ్యపద్లో జరిగిన 76వ గణతంత్ర దినోత్సవ పెరేడ్లో భాగంగా ప్రదర్శించిన శకటాల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ శకటానికి కేంద్ర ప్రభుత్వం జ్యూరీ అవార్డు ప్రకటన అత్యంత ఆనందం కలిగించిందని రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్, అనకాపల్లి పార్లమెంట్ సభ్యులు డాక్టర్ సీఎం రమేష్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.ఆయన ప్రకటనలో చెప్పిన మాటలివి.ఏటికొప్పాక లక్క బొమ్మలు అంటే కేవలం అందమే కాదు అనకాపల్లి జిల్లా ప్రజల సెంటిమెంట్ అని మరోసారి రుజువైందని,ఆంధ్ర రాష్ట్ర వారసత్వ సంప్రదాయానికి ప్రతీకగా ఉన్న ఏటికొప్పాక బొమ్మలతో రూపొందించి, ప్రదర్శించిన శకటం రిపబ్లిక్ డే పెరేడ్ ఉత్సవాలకే హైలెట్గా నిలిచి యావత్ దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షించి సామాజిక మాధ్యమాల్లో సైతం లక్షలాది మంది ఈ శకటానికి మంత్రముగ్దులై, ప్రశంసలతో ముంచెత్తడం అనకాపల్లి జిల్లా ప్రజలు అదృష్టంగా భావిస్తున్నారని పేర్కొన్నారు. శకటం ముందు వినాయకుడు, చివర కలియుగ ప్రత్యక్షదైవం శ్రీవేంకటేశ్వరస్వామి ఎత్తైన రూపాలతో, ఇరువైపులా బొబ్బిలి వీణలు, తెలుగువారి కట్టుబొట్టు ప్రతిభింభించేలా అమర్చిన ఏటికొప్పాక బొమ్మల కొలువుతో శకటం ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయులను ఎంతగానో ఆకట్టుకుంది అని తెలిపారు.శకటం నడుస్తున్నంత సేపు ఏటి కొప్పాక బొమ్మల ప్రాశస్త్యాన్ని చాటుతూ ‘’బొమ్మలు బొమ్మలు ఏటికొప్పాక బొమ్మలు, ఆంధ్రప్రదేశ్ బొమ్మలు, ఇవి విద్యను నేర్పే బొమ్మలు, వినోదాల బొమ్మలు, భక్తి చాటే బొమ్మలు, హస్తకళల హంగులు, సహజ ప్రకృతి రంగులు’’ అంటూ సాగే గీతంతో తెలుగు ప్రజలందరి హృదయాలను దోచుకుందన్నారు.రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు సైతం ఈ శకటం మనోహరమైన రూపాన్ని చూసి పులకించిపోయారు అని తెలిపారు.మూడు దశాబ్దాల తర్వాత రాష్ట్ర శకటానికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం లభించడం ఎంతో గర్వకారణంగా ఉంది అన్నారు.మన దేశ సంస్కృతి సాంప్రదాయాలు ఉట్టిపడేలా నమూనా రూపొందించిన అద్భుతమైన కళాకారుడు గోరసా సంతోష్ కు శుభాభినందనలు తెలిపారు.శకటంపై నృత్య గాన ప్రదర్శనలు ఇచ్చే కళాకారుల బృందానికి విశాఖపట్నం నుంచి ఢిల్లీ వరకు చేరుకోవడానికి సహకరించిన రైల్వే సిబ్బందికు మరియు ఓటింగ్లో కూడా పెద్ద ఎత్తున ఏటికొప్పాక శకటానికి మద్దతు పలికిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అనకాపల్లి జిల్లా ఖ్యాతిని దేశవ్యాప్తంగా తెలియజేసిన ఏటికొప్పాక కళాకారులకి ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.