ప్రమాదకర మలుపుల వద్ద తీసుకోవలసిన చర్యలపై అవగాహన
జిల్లా రవాణా శాఖాధికారి ఎ.వరప్రసాద్
పార్వతీపురం,వైజాగ్ ఎక్స్ ప్రెస్,జనవరి 31 : జిల్లాలోని పలు ప్రాంతాల్లోని ప్రమాదకర మలుపుల వద్ద తీసుకోవలసిన జాగ్రత్తలు, పాటించవలసిన నియమాలపై వాహన డ్రైవర్లకు, ప్రజలకు అవగాహన కల్పించినట్లు జిల్లా రవాణా శాఖాధికారి ఎ.వర ప్రసాద్ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన జారీచేశారు. ప్రమాదకర మలుపుల వద్ద ద్విచక్ర, నాలుగు చక్రాల, భారీ, అతిభారీ వాహనాల వలన ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉందని, ఇటువంటి అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని అన్నారు. రహదారి భద్రతా మాసోత్సవాల సందర్బంగా జిల్లాలోని కూనేరు - రామ భద్రపురం రోడ్డులో మరిపి వలస, అర్తం, కోటిపాం 2, గంగరేగు వలస, గుమడ, కొమరాడ వద్ద గల 7వ ప్రమాదకర మలుపు వద్ద సహాయ ఇంధన శకట తనిఖీదారు, పోలీస్ అధికారులు సంయుక్తంగా తనిఖీ నిర్వహించి, తీసుకోవలసిన జాగ్రత్తలపై అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు. అదేవిధంగా కురుపాం మండలం తోటపల్లి -గునుపురం రోడ్డులో జట్టు ఆశ్రమం దగ్గర, గిజబ మరియు పూతికవలస దగ్గర 3వ ప్రమాదకర మలుపు వద్ద సహాయ ఇంధన శకట తనిఖీదారు, పోలీస్ అధికారులు, ఆర్ అండ్ బి అధికారులు సంయుక్తంగా తనిఖీ నిర్వహించి అవగాహన కల్పించడం జరిగిందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో సహాయ ఇంధన శకట తనిఖీదారు జి.సత్య నారాయణ, కురుపాం, గరుగుబిల్లి, కొమరాడ, సీతానగరం ఎస్ఐలు నారాయణ, రమేష్ నాయుడు,నీలకంఠం, రాజేష్ కుమార్, ఆర్ అండ్ బి ఏఈఈలు రాజేందర్ కుమార్, రామ్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు.