ప్రజా వ్యతిరేకమైన కేంద్ర బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ సిపిఎం ఆధ్వర్యంలో నిరసన
అమలాపురం, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 6:
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఆంధ్ర రాష్ట్రానికి తీవ్రమైన అన్యాయం జరిగిందని ఇది పూర్తిగా ప్రజావ్యతిరేకమైన బడ్జెట్ అని దీన్ని ప్రజలందరూ తీవ్రంగా వ్యతిరేకించి నిరసన తెలియజేయాలని సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి బలరాం అన్నారు. డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం గడియార స్తంభం సెంటర్ వద్ద జరిగిన బడ్జెట్ కి వ్యతిరేకంగా జరిగిన నిరసన కార్యక్రమంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు బి. బలరాం, రాష్ట్ర కమిటీ సభ్యులు అండ్రా మాల్యాద్రి ముఖ్యవక్తులుగా పాల్గొని మాట్లాడారు.
కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆశలను అడియాసలు చేసింది. ఏపికి మళ్లీ మొండి చేయి చూపించింది ప్రత్యేకహోదా, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ వంటి విభజన హామీలను పక్కన పెట్టింది. విభజన చట్టం ప్రకారం వచ్చిన ఏ జాతీయ విద్యా సంస్థకు కేటాయింపులు చేయలేదు. విశాఖ రైల్వే జోన్, ఎన్ఐటి, ఐఐటి, ఐఐఎం, ట్రిపుల్ ఐటి, ఐఐఎస్ఈఆర్, గిరిజన యూనివర్శిటీ, సెంట్రల్ యూనివర్శిటీ, దుగరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్, వైజాగ్ మెట్రో. ఎయిమ్స్, వెనుకబడిన జిల్లాల నిధులు, రాజధాని నిర్మాణానికి నిధుల ఊసేలేదు. రాజధాని నిర్మాణానికి గతంలో ప్రకటించిన ప్రపంచ బ్యాంక్ రుణాన్నే పదే పదే ప్రస్తావించారు తప్ప కొత్తగా కేటాయింపు లేదు. రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తులను కూడా కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది. దీనిపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందించాలి. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై అన్ని పార్టీల ఎంపిలు కేంద్రాన్ని నిలదీయాలి.అయితే మరోవైపు వైజాగ్ స్టీల్ ప్లాంట్ కు గతేడాది రూ.8,622 కోట్లు కేటాయిస్తే, ప్రస్తుత బడ్జెట్ లో రూ.3,295 కోట్లు కేటాయించింది. అంటే గతేడాది కంటే బడ్జెట్ లో రూ.5,327 కోట్లను తగ్గించింది. ఆర్భాటంగా ప్రకటించిన రూ.11,440 కోట్లు ప్యాకేజీ ప్రస్తావన లేదు. స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ నిలుపుదల గురించి మాట్లాడకపోవడం మోసం చేయడమే. విభజన హామీల్లో భాగంగా ఉన్న కడప ఉక్కు ఫ్యాక్టరీ ప్రస్తావనా లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ను ఈ బడ్జెట్ గాలికొదిలేసింది. పోలవరం ప్రాజెక్టుకు గతేడాది రూ.5,512.50 కోట్లు కేటాయిస్తే, ఈసారి రూ.5,936 కోట్లు కేటాయించింది. అయితే పునరావసం, పరిహారం ప్యాకేజీ గురించి స్పందించలేదు. 55 వేల కోట్లు తాజా అంచనాలకు 33 వేల కోట్లు తగ్గింది. నిర్వాసితులకు కోత విధించడానికే ప్రభుత్వం సిద్ధపడడం దుర్మార్గం. ఏపికి కేంద్ర ప్రభుత్వం చేసిన ద్రోహంపై ప్రజలు నిరసన వ్యక్తం చేయాలని కోరుతున్నాము.సిపిఎం పార్టీ జిల్లా కన్వీనర్ కారెం వెంకటేశ్వర మాట్లాడుతూ కోనసీమ రైల్వే లైన్ కు నిధులు పెంచకపోవడం తీవ్రమైన అన్యాయమని ఈసారి కూడా రైల్వే లైన్ కు బడ్జెట్లో పూర్తిస్థాయి నిధులు కేటాయించుకోవడం అన్యాయమని ఆయన మండిపడ్డారు ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ జిల్లా కమిటి సభ్యులు కే కృష్ణవేణి, జి దుర్గాప్రసాద్, టి ఎన్ బలరాం, టి నాగ వరలక్ష్మి , జిల్లా నాయకులు పీతల రామచంద్రరావు, కే గోపాలం భాస్కరరావు, తాడి శ్రీరామ్మూర్తి శంకర్ కే సాయి తదితరులు పాల్గొన్నారు