Sidebar


Welcome to Vizag Express
కోట్ల నిధులు వృధా వ్యయం నిరుపయోగంగా బాలికల వసతి గృహం

06-02-2025 21:41:01

కోట్ల నిధులు వృధా వ్యయం 
నిరుపయోగంగా బాలికల వసతి గృహం 

ఎల్ఎన్ పేట, వైజాగ్ ఎక్స్ ప్రెస్, ఫిబ్రవరి 06:

ఎల్ ఎన్ పేట మండలం లో బాలికల విద్యాభివృద్ధికి కోట్ల రూపాయలు ఖర్చు చేసి నిర్మించిన వసతి గృహ భవనం నిరుపయోగంగా దర్శనమిస్తోంది. మండల కేంద్రం ఎల్ ఎన్ పేట గ్రామం లో ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సమీపంలో 2019 ఎన్నికలకు ముందు అప్పటి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం పాలనలో అప్పటి పాతపట్నం స్థానిక ఎమ్మెల్యే కలమట వెంకటరమణ మూర్తి కృషి ఫలితంగా రాష్ట్రీయ మాధ్యమిక విద్య అభియాన్ పేజ్-2 లో సుమారు రెండు కోట్లు రూపాయలు ప్రభుత్వ ధనం ఖర్చు చేసి ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల అనుబంధ బాలికల వసతి గృహ భవనం నిర్మాణం చేశారు. ఈ భవన నిర్మాణానికి 1.94 కోట్లు నిధులు ఖర్చు చేశారు. ఐతే 2019 లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఓటమి పాలవ్వడంతో అప్పటి నుండి ఈ వసతి గృహం భవనం నిరుపయోగంగా దర్శనమిస్తుంది. దీనితో ఈ భవనం కోసం ప్రజాధనం ఖర్చు చేసిన కోట్ల రూపాయల నిధులు వృధావేయంగా మారింది. అన్ని అంగులతో ఈ భవనం అత్యంత సుందరంగా  నిర్మాణం జరిగింది. అయితే ఏ లక్ష్యంతో ఈ భవన నిర్మాణం చేశారో ఆ లక్ష్యం మరుగున పడిందని చెప్పవచ్చు. 2024 కీ ముందు అధికారంలో ఉన్న వైయస్సార్సీపి ప్రభుత్వం ఎమ్మెల్యే రెడ్డి శాంతి ఈ భవనాన్ని ప్రారంభించినప్పటికీ కూడా ఈ భవనం వినియోగంలోకి రాలేదు. ఈ భవనం పర్యవేక్షణ లోపం వలన ఊరికి కొద్దిగా దూరంలో నిర్మానుష్య ప్రదేశంలో ఉండటం అనేక అసాంఘిక కార్యక్రమాలకు అడ్డగా నిలిచింది. భవనంలో విద్యుత్ దీపాలు, ఫ్యాన్లు, విద్యుత్ పరికరాలు చోరీ గావించబడ్డాయి. ఈ మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత భవనములో విద్యుత్ పరికరాలు తదితరలు రిపేరు కోసం ఒక లక్ష రూపాయలు ఖర్చు చేసిన ఫలితం లేకపోయింది. భవనం కొత్తదైనప్పటికీ వినియోగంలో లేకపోవడం వలన శిధిలావస్థకు చేరుకుంటుంది. ఏది ఏమైనాప్పటికీ  ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలికల అనుబంధ వసతి గృహ భవనం మాత్రం నిరుపయోగంగానే దర్శనమిస్తుండడం గమనార్హం.