వైజాగ్ ఎక్స్ ప్రెస్ న్యూస్
రూ.63.50 కోట్ల రూపాయలతో 2000 సంవత్సరంలో వేసిన విశాఖ నాలుగు లైన్ల రహదారి పేరిట వేల కోట్ల వసూలు.
ఈ రహదారి నిర్వహణకు 150 కోట్ల రూపాయలకు పైగా ఖర్ఛు చేసిన జీవీఎంసీ
పట్టించుకోని,పార్లమెంటులో ప్రస్తావించని ఎంపీలు.
నిబంధనలకు విరుద్ధంగా రెండు రహదారుల్లో టోల్ వసూలు.
2015లోనే జాతీయ రహదారి నుంచీ దీనిని తప్పిస్తూ గెజిట్... అయినా ఇప్పటికీ తప్పని అగనంపూడి టోల్ వసూలు.
దేశంలో అతి తక్కువ టోల్ లు తమిళనాడు, గుజరాత్,లో ఉంటే అతి ఎక్కువ టోల్ ఏపీ లో ఉన్నాయి.80% టోల్ ఏపీ ఎన్ హెచ్ లో ఉన్నాయి.
అగనంపూడి ఎక్స్ ప్రెస్ న్యూస్, ఏప్రిల్ 22:
విశాఖ నగరం నడిబొడ్డున వున్న నాలుగు లైన్ల రహదారి విశాఖ వాసులను నిలువు దోపిడీ చేసేస్తుంది. అనకాపల్లి నుంచి ఆనందపురం వరకూ విశాఖ నగరంలో నుంచి 2000 సంవత్సరంలో 62 కోట్ల రూపాయలతో జాతీయ రహదారుల సంస్ధ (ఎన్ హెచ్ ఏ ఐ) నిర్మించిన ఈ రహదారి పేరిట టోల్ మాఫియా ఇప్పటికీ వేల కోట్ల రూపాయలను వసూలు చేసింది. ఇంకా చేస్తూనే వుంది. ఎన్ హెఛ్ ఏ ఐ విశాఖ నగరంలో నుంచి వెళ్లే ఈ రహదారికి ప్రత్యామ్నయంతో ఆనందపురం నుంచి అనకాపల్లి వరకూ పెందుర్తి మీదుగా కొత్త రహదారిని నిర్మించింది. అందులో రెండు టోల్ గేట్లను ఏర్పాటు చేసి అక్కడ వసూలు ప్రారంభించింది. దానినే జాతీయ రహదారిగా గుర్తించి విశాఖ నగరంలోని రహదారికి జాతీయ రహదారి హోదాను తీసివేస్తూ గెజిట్ కూడా జారీ చేశారు. అయినా టోల్ వసూలు మాత్రం ఆగడం లేదు.ఇందుకు కారణం ఎన్ హెచ్ ఏ ఐ అధికారుల లంచగొండితనం, మహా విశాఖ నగర పాలక సంస్ధ ( జీ వీ ఎం సీ) చేతకానితనం, కొందరు అధికార పార్టీ పెద్దల అవినీతి, పార్లమెంటు సభ్యలు నిర్లిప్తతే. ఇవన్నీ కలగలిసి అగనంపూడి టోల్ పేరిట విశాఖ వాసులపై ప్రతి ఏటా వందల కోట్ల భారాన్ని వేస్తున్నాయి. ఈ టోల్ గడువు ఎప్పుడో ముగిసిపోయినా, రహదారి నిర్మాణం తరువాత నిర్వహణను జీవీఎంసీ యే చూసుకుంటున్న, ఈ రహదారి ని జాతీయ రహదారుల నుంచి మినహాయించినా అడిగే వారు లేక అమాయన విశాఖ నగర ప్రజలు బలైపోతున్నారు. పాలక పక్షం మాఫియాతో చేతులు కలిపి దోపిడిలో భాగస్వామిగా మారి జనాన్ని దోచుకొంటుంది.మద్యం యజమానులు రహదారి పక్కన వైన్ షాప్ లు పెట్టుకొనే లైసెన్స్ ల కోసం 2016 లో ఎన్ హెచ్ ఏ ఐ అధికారులను సంప్రదించినప్పుడు ఇది జాతీయ రహదారి కాదంటూ అధికారులు సర్టిఫై చేశారు. ఆ సర్టిఫికేట్ ల ఆధారంగానే ఈ రహదారి వెంట బార్లు, వైన్ షాపులు వెలిశాయి.విచిత్రంగా మద్యం వ్యాపారుల విషయంలో ఇది జాతీయ రహదారి కాదు కానీ వాహన దారుల విషయంలో మాత్రం ఇప్పటికీ జాతీయ రహదారే. మరో విచిత్రం ఏమంటే 2000 సంవత్సరంలో ఎన్ హెచ్ ఏ ఐ రహదారిని నిర్మించి టోల్ వసూలు చేసుకోవడం మినహా నిర్వహణను గాలికి వదిలేసింది. జీ వీ ఎం సీ అప్పటి నుంచి ఈ రహదారి మరమ్మత్తులు, నిర్వహణ, లైటింగ్, డివైడర్ , గ్రీన్ బెల్డ్ వంటి వాటికి 150 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసింది. అంటే రహదారి నిర్మాణ వ్యయం కంటే మూడింతలు ఖర్చు చేసింది. సొమ్ము జీ వీ ఎం సీ ది అయితే టోల్ వసూలు సోకు మాత్రం ఎన్ హెచ్ ఏ ఐ మాఫియాది. 2017లో దీనిపై హైకోర్టులో కేసు పడగా 2019 తీర్పు ప్రజలకు అనుకూలంగా వచ్చింది. అసలు ఇది జాతీయ రహదారే కానప్పుడు టోల్ వసూలు చేయరాదని హైకార్టు తీర్పు ఇచ్చింది. గట్టిగా మాట్లాడితే పాత బకాయిలను కూడా జీ వీ ఎం సీ కి చెల్లించాల్సి వస్తుందని అప్పటి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రవీణ్ కుమార్ బెంచ్ పై నుంచి హెచ్చరిక జారీ చేశారు.దీంతో టోల్ గేటును మూసి వేశారు.అయితే మూసివేత విషయంలో జిల్లా అధికారులు నిర్లక్షంగా వ్యవహరించడం,ఆ సమయంలోనే రాష్ట్రంలో ప్రభుత్వం మారాడం, వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు కొందరు మాఫియాకు లొంగిపోవడం, టోల్ బూత్ లను తొలగించకపోవడంతో టోల్ మాఫియా అసత్యాలతో సుప్రీం కోర్టును ఆశ్రయించి తాత్కాలిక రిలీఫ్ ఆర్డర్ పొందింది. వెంటనే సుప్రీంకోర్టులో కౌంటర్ ఫైల్ చేయాల్సిన జీ వీ ఎం సీ కొందరు ప్రభుత్వ పెద్దల ఒత్తిడి కారణంగా మిన్నకుండి పోవదంతో నాలుగున్నర సంవత్సరాలుగా జాతీయ రహదారి కాని రహదారికి జాతీయ రహదారి టోల్ ను విశాఖ వాసులు చెల్లిస్తున్నారు. మరే నగరంలో ఈ దోపిడి లేదు. అనకాపల్లి ఆనందపురం టోల్ గేట్ పక్కనే సర్వీస్ ఉంటుంది.
అగనంపూడి లో సర్వీస్ రోడ్ కట్టలేదు. అలాగే ఈ టోల్ గేట్ చుట్టూ ఉన్నా 4 మునిసిపల్ డివిజన్ ప్రజలకు గతంలో ఉచిత ప్రయాణం స్టికర్ లు ఇచ్చారు. ఇప్పుడు అవి తీసేసారు. ఈ టోల్ గేట్ విషయంలో 123 కోట్లు హై వే వాడు జివిఎంసి కి ఇవ్వాలని హై కోర్ట్ ఆదేశాలు ఇచ్చింది. జివిఎంసి వాళ్ళు ఆ డబ్బులు ఇప్పటికి అడగడం లేదు. ఈ అంశాన్ని విశాఖ ప్రాంత పార్లమెంటు సభ్యులు పట్టించుకోకపోవడం పార్లమెంటులో ప్రస్తావించకపోవడం కేంద్ర మంత్రుల వరకూ తీసుకు వెళ్లకపోవడంతో ఏటా విశాఖ వాసులు వంద కోట్లకు పైగా టోల్ చెల్లించాల్సి వస్తుంది. విశాఖ ఎం.పి. ఎం.వి.వి. సత్యనారాయణ, రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి గుడివాడ అమర్, గాజువాక శాసనసభ్యుడు తిప్పల నాగిరెడ్డి టోల్ నేరానికి బాధ్యులు. విశాఖను దత్తత తీసుకొన్నానని పదే పదే ప్రకటిస్తూ రిక్షా తొక్కుతూ, డాన్స్లు వేసి సంక్రాంతి సంబరాలు జరిపిన జీ వీ ఎల్ నరసింహారావు వంటి వారు కేంద్రంలో చక్రం తిప్పే నేతలు కూడా దీనిని పట్టించుకోకపోవడం దారుణమే. ప్రత్యామ్నాయ జాతీయ రహదారి నిర్మాణం పూర్తి అయి అందులో రెండు టోల్ బూత్ లను ఏర్పాటు చేసి టోల్ వసూలు చేస్తునప్పుడు, విశాఖ నగరంలోనిది జాతీయ రహదారే కానప్పుడు ఇక్కడ వసూలు చేయడం నిబంధనలకు విరుద్ధం. అన్యాయం. ఈ విషయాన్ని సుప్రీం కోర్టుకు, ఎన్ హెచ్ ఏ ఐ ఉన్నతాధికారులు, జాతీయ రహదారుల మంత్రి నితిన్ గడ్కరీ దృష్టికి తీసుకు వెళ్లడం ద్వారా నగర వాసులకు ఉపశమనం కలిగించవచ్చు. అయితే, అధికార పార్టీ పెద్దలకు టోల్ మాఫియా నుంచి నెలవారీ లక్షలలో అందుతున్న ముడుపుల కారణంగానే పని చేయడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ సమస్య పై తెదేపా, జనసేన, కమ్యూనిస్టు పార్టీ లు అనేక సార్లు నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దీనిపై జీవీఎంసీ పాలక వర్గంతో పాటు, ఈ ప్రాంత పార్లమెంటు సభ్యులు వెంటనే స్పందించి అగనంపూడి టోల్ బూత్ ను వెంటనే తొలగింపజేయాలని డిమాండు చేస్తున్నారు.