స్టీల్ ప్లాంట్ కై నాడు రక్త తర్పణం-నేడు రక్తదానం

6/14/2024 10:27:38 PM

స్టీల్ ప్లాంట్ -ఎక్స్ ప్రెస్ న్యూస్ :
విశాఖ స్టీల్ ప్లాంట్ కై నాడు రక్త తర్పణం-నేడు రక్తదానం చేస్తున్న ప్రతి ఒక్కరూ ధన్యజీవులే అని ఆంధ్ర యూనివర్సిటీ మాజీ ప్రిన్సిపాల్, ఎన్నారై హాస్పిటల్ మెడికల్ డీన్ డాక్టర్ సుధాకర్ అన్నారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ఉక్కునగరం డాక్టర్ అంబేద్కర్ కళాక్షేత్రం ( సి డబ్ల్యూ సి-1) లో "స్టీల్ ప్లాంట్ రక్షణకై-రక్తదానం చేద్దాం"అనే మహోన్నత ఆశయంతో 7సారి రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. దీనిలో ఇండియన్ రెడ్ క్రాస్, లైన్స్ క్లబ్, లైఫ్ షేర్ బ్లడ్ బ్యాంక్ వారు రక్తదాతల నుంచి రక్తాన్ని సేకరించారు.
దీనికి ముఖ్య అతిథిగా విచ్చేసిన డాక్టర్ సుధాకర్ మాట్లాడుతూ విశాఖ స్టీల్ ప్లాంట్ ఆంధ్ర రాష్ట్రంలో అవతరించడానికి ఆనాడు 32 మంది ప్రాణత్యాగం చేశారని దానిలో మా కుటుంబ సభ్యులకు కూడా భాగస్వామ్యం అయ్యారని ఆయన గుర్తు చేశారు. దీని రక్షణకై నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో రక్తదానం చేసి ప్రజలకు రక్తాన్ని ఇవ్వడానికి కూడా స్టీల్ కార్మికులు సిద్ధంగా ఉన్నారని గడచిన ఏడు సంవత్సరాలుగా దీనిని నిర్వహిస్తున్నారని ఆయన వివరించారు. ఇకనైనా ప్రభుత్వాలు దీనిని కాపాడడం కోసం తగు చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. 
విశాఖ స్టీల్ జనరల్ హాస్పిటల్ విభాగాధిపతి డాక్టర్ నవీన్ కుమార్ మాట్లాడుతూ ప్రజలలో రక్తదానంపై అవగాహన కల్పిస్తున్న స్టీల్ సిఐటియు కార్యకర్తలు ఈ సమాజానికి ఆదర్శంగా నిలుస్తున్నారని ఆయన అన్నారు. నేడు ప్రపంచానికి కోట్లలో రక్తం అవసరమైతే మన వద్ద లక్షలలోనే అందుబాటులో ఉందని ఆయన వివరించారు. ఒక వ్యక్తి రక్తదానం ద్వారా 10 మంది రోగులకు అవసరమైన చికిత్స చేయడం జరుగుతోందని ఆయన అన్నారు. కనుక ఇటువంటి రక్తదాన శిబిరాలను నిర్వహిస్తూ నేటి యువతరంలో మరింత అవగాహన కల్పించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అభ్యర్థించారు. 
దీనిని సందర్శించిన ప్రముఖులు స్టీల్ ప్లాంట్ సి ఎం డి శ్రీ అతుల్ భట్, డైరెక్టర్స్,  సి ఐ ఎస్ ఎఫ్ కమాండెంట్ ఆసిఫ్ అహ్మద్, స్టీల్ ప్లాంట్ ఉన్నత అధికారులు మరియు 78వ కార్పొరేటర్ డాక్టర్ బి గంగారావు, స్టీల్ ప్లాంట్ అఖిలపక్ష కార్మిక సంఘాల ప్రతినిధులు, స్టీల్ సిఐటియు గౌరవాధ్యక్షులు జె అయోధ్యరామ్, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వైటి దాస్, యు రామస్వామి, స్టీల్ సిఐటియు నాయకులు, పి శ్రీనివాసరాజు, బి అప్పారావు, కె గంగాధర్, టివికె రాజు, కె.వి సత్యనారాయణ, పుల్లారావు, నీలకంఠం, మరిడయ్య, బి ఎన్ మధుసూదన్, మహేష్, శ్రీనివాస్ రెడ్డి, శ్రీనివాస్, స్టీల్ ప్లాంట్ ఒప్పంద కార్మిక సంఘం ప్రతినిధులు ఓ వి రావు, జి శ్రీనివాస్, వివి రమణ తదితరులతో పాటు వివిధ విభాగాల అధ్యక్ష కార్యదర్శులు మరియు అధిక సంఖ్యలో రక్తదాతలు మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*