హిరమండలం: ఎక్స్ ప్రెస్ న్యూస్: జూలై 26:
వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ వంటివి ప్రబలకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, ప్రతీ శుక్రవారం అందరూ డ్రై డే పాటించాలని మేజర్ పంచాయతీ ఈవో వై శ్రీరామచంద్ర మూర్తి పేర్కొన్నారు. ఈ రోజు ఆయన పలు వీధుల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన స్థానికులతో మాట్లాడుతూ ఇళ్లలో వాడే కుండీలలోని నీటిని రెండు రోజులకొకసారి మార్చాలని, ఎక్కువ రోజులు నీటిని నిల్వ ఉంచకూడదని, కొబ్బరిబొండాలు, ప్లాస్టిక్ వంటి వస్తువులు ఇళ్ల పరిసరాల్లో వుంచకుండా చూడాలని సూచించారు. అనంతరం స్థానిక జగన్నాధ స్వామి ఆలయం దగ్గర డ్రైనేజీ నీరు ప్రధాన రహదారిపై రాకుండా దిగువకు ప్రవహించేలా చూడాలని పారిశుద్ధ్య సిబ్బందికి సూచించారు. రోడ్లు, కాలువలను రోజూ శుభ్రం చేయాలని, ఎక్కడా చెత్త కనిపించకూడదని, ఎప్పటికప్పుడు చెత్తను డంపింగ్ యార్డుకు తరలించాలన్నారు. ఈయనతో పాటు సీనియర్ సహాయకులు ఎ. నర్సింగరావు ఉన్నారు.