మీ దుర్మార్గపు కుట్రలు తిప్పికొడతాం

7/26/2024 10:17:50 PM

- కార్గిల్‌ నుంచి పాక్‌కు మోదీ హెచ్చరిక
- అమ‌ర‌వీరుల‌కు నివాళులు

లద్దాఖ్‌: 
దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టి పోరాడిన సైనికుల త్యాగాలకు యావత్‌ భారతావని ఎప్పటికీ రుణపడి ఉంటుందని  ప్రధానమంత్రి నరేంద్రమోదీ అన్నారు.  కార్గిల్‌ 25వ విజయ దివస్‌ను పురస్కరించుకుని శుక్రవారం ఆయన లద్దాఖ్‌ వెళ్లారు. ద్రాస్‌లోని యుద్ధ స్మారకాన్ని సందర్శించి అమర జవాన్లకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాకిస్థాన్‌పై విరుచుకుపడ్డారు. ఉగ్రవాదాన్ని సమూలంగా పెకిలిస్తామని దాయాది దేశాన్ని మరోసారి గట్టిగా హెచ్చరించారు.
‘‘గతంలో పాకిస్థాన్‌ పాల్పడిన వికృత ప్రయత్నాలు విఫలమయ్యాయి. అయినా, చరిత్ర నుంచి ఆ దేశం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదు సరికదా.. ఉగ్రవాదం, ప్రాక్సీ వార్‌తో ఇంకా మనపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. ఈ రోజు నేను మాట్లాడే మాటలు.. ఉగ్రవాదులను తయారుచేస్తున్న వారికి (పాక్‌ సైన్యాన్ని ఉద్దేశిస్తూ) నేరుగా వినబడతాయి. ముష్కరులను పెంచి పోషిస్తున్న వారికి నేను చెప్పేది ఒక్కటే.. వారి దుర్మార్గపు కుట్రలు ఎన్నటికీ ఫలించవు. మా దళాలు ఉగ్రవాదాన్ని నలిపివేసి.. శత్రువులకు తగిన జవాబిస్తాయి’’ అని మోదీ పాక్‌ను హెచ్చరించారు.
‘‘కార్గిల్‌ యుద్ధానికి లద్దాఖ్‌ సాక్షిగా నిలుస్తుంది. అమరుల త్యాగాలకు గుర్తుగా విజయ్‌ దివస్  జరుపుకుంటున్నాం. మన బలానికి, సహనానికి, వాస్తవాలకు ఈ విజయగాథ నిదర్శనం. దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన సైనికులు చిరకాలం గుర్తుండిపోతారు. కార్గిల్‌ యుద్ధ సమయంలో సామాన్యుడిగా సైనికుల మధ్య ఉండే అదృష్టం నాకు దక్కింది. దేశం కోసం వారు చేసిన పోరాటం నా మదిలో నిలిచిపోయింది. లద్దాఖ్‌, జమ్మూకశ్మీర్‌ అభివృద్ధి కోసం ఎలాంటి సవాళ్లనైనా భారత్‌ అధిగమిస్తుంది. మరికొద్ది రోజుల్లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసి ఐదేళ్లు పూర్తవుతాయి. ఇప్పుడు జమ్మూకశ్మీర్‌ ప్రజలు సరికొత్త భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్నారు. పెద్ద కలల గురించి మాట్లాడుకుంటున్నారు. ప్రస్తుతం కశ్మీర్‌ ప్రతిష్ఠాత్మక కార్యక్రమాలకు నిలయంగా ఉంది. ఈ భూలోక స్వర్గం శాంతి, సౌభ్రాతృత్వం వైపు వేగంగా పరిగెడుతోంది’’ అని మోదీ తెలిపారు.

ప్ర‌ధాని నివాళులు...
అంతకుముందు, యుద్ధ స్మారకం  వద్ద కార్గిల్‌ అమరవీరులకు ప్రధాని నివాళులర్పించారు. వీర జవాన్ల కుటుంబసభ్యులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా షింకున్‌ లా టన్నెల్‌ ప్రాజెక్ట్‌ నిర్మాణపనులను ప్రధాని మోదీ ప్రారంభించారు. టన్నెల్‌ నిర్మాణ ప్రాంతం వద్ద వర్చువల్‌గా తొలి బ్లాస్ట్‌ చేశారు. 4.1 కిలోమీటర్ల పొడవైన ఈ ట్విన్‌ ట్యూబ్‌ టన్నెల్‌ను 15,800 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. అత్యవసర పరిస్థితుల్లో సాయుధ దళాలను వేగంగా తరలించేందుకు, సైనిక సామగ్రిని చేరవేసేందుకు ఈ సొరంగం సమర్థంగా ఉపయోగపడనుంది. దీని నిర్మాణం పూర్తయితే ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన సొరంగంగా గుర్తింపు సాధించనుంది.

Name*
Email*
Comment*