- మందకృష్ణ మాదిగ
న్యూఢిల్లీ:
‘‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం అని మాదిగ పోరాట సమితి నేత మంద కృష్ణ మాదిగ అన్నారు. ఏనాటికైనా ధర్మమే గెలుస్తుందని నిరూపితమైంది. ఈ పోరాటంలో చాలా మంది అసువులబాశారు. సుప్రీం కోర్టులో న్యాయం గెలిచింది. ఈ విజయం కోసం 30 ఏళ్ల నుంచి పోరాటం చేస్తున్నాం. ఎన్ని కష్టాలు ఎదురైనా అంకిభావంతో జాతి పోరాడింది. వర్గీకరణ పోరాటాన్ని నీరుగార్చుందుకు యత్నించారు. ఎస్సీ వర్గీకరణకు తీర్పు ఇచ్చిన న్యాయమూర్తులకు ధన్యవాదాలు. ఈ తీర్పుతో తెలంగాణలో 11శాతం, ఆంధ్రప్రదేశ్లో ఏడు శాతం మాదిగలకు రిజర్వేషన్ దక్కే అవకాశం ఉంది. ఉద్యోగ నోటిఫికేషన్లలో వర్గీకరణ వెంటనే చేయాలని సూచించారు. విద్యాసంస్థల్లో కూడా వర్గీకరణకు అనుకూలంగా రిజర్వేషన్ చేయాలి. ఉద్యమాన్ని దెబ్బతీసే కుట్రలు జరిగాయి. కొంతమంది వెన్నుపోటు పొడిచారు. సమాజం యావత్తు మాదిగల వైపు నిలబడింది. ఎన్నో రాజకీయ పార్టీలు, వ్యక్తులు మా వైపు నిలబడ్డారు. న్యాయాన్ని, ధర్మాన్ని బతికించడం కోసం మా వైపు నిలబడ్డ అందరికీ ధన్యవాదాలు. సమాజంలో పెద్దలు, మీడియాకు కృతజ్ఞతలు. అణగారిన వర్గాల వైపు, పేద వర్గాల వైపు న్యాయం నిలబడింది. ప్రధాన న్యాయమూర్తుల తో పాటు, ఇతర న్యాయమూర్తులకు కృతజ్ఞతలు. మాకు అండగా నిలబడ్డ ప్రధాని మోదీ, అమిత్ షా, భుజాన వేసుకుని మా వైపు ఉన్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డిలకు కృతజ్ఞతలు. సుప్రీంకోర్టు తాజా తీర్పును తెలుగు రాష్ట్రాల్లో విద్యా, ఉద్యోగ నియామకాల్లో అమలు చెయ్యాలి. ప్రభుత్వాల దగ్గర ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలు ఉన్నాయి. కాబట్టి ప్రస్తుతం ఉన్న ఉద్యోగ నియామకాల్లో కూడా అమలు చెయ్యాలి’’ అని అన్నారు.