ఏపీలో బ్రాండ్ మద్యం ధరలు ఫిక్స్

8/14/2024 5:58:54 PM

- అమ్మకాలు ఇలా..
- క్వార్టర్‌ బాటిల్‌ను రూ.80 నుంచి రూ.90 కే

విశాఖ‌ప‌ట్నం, ఎక్స్‌ప్రెస్ న్యూస్‌;    
మందుబాబులకు కూట‌మి స‌ర్కారు  గుడ్ న్యూస్ చెప్పింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు బ్రాండ్ మద్యం తక్కువ ధరకే అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు లిక్కర్ కంపెనీలతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. కొత్త ఎక్సైజ్ పాలసీ పైన కసరత్తు చేస్తున్న ప్రభుత్వం అక్టోబర్ 1 నుంచి నూతన విధానం అమలు చేయనుంది. అదే సమయంలో గతంలో ఉన్న విధంగా ప్రయివేటు వ్యక్తులకే మద్యం దుకాణాల నిర్వహణ పైనా నిర్ణయం తీసుకొనే అవకాశం ఉంది.  ఏపీలో కొత్త మద్యం పాలసీ పైన కసరత్తు వేగవంతం చేసారు. నూతన మద్యం విధానాన్ని అక్టోబర్‌ నుంచి అమల్లోకి తీసుకురానున్న ప్రభుత్వం... ఆ మేరకు కార్యాచరణ సిద్ధం చేస్తోంది. ఈ విషయమై ఇప్పటికే ఆరు రాష్ట్రాల్లో పర్యటించిన అధికారులు.. ఆయా చోట్ల అమలు చేస్తున్న మద్యం విధానాలను అధ్యయనం చేశారు. ఒకటి రెండు రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక సమర్పించనున్నారు. మద్యం కొనగోళ్లపై ఆయా కంపెనీలతో ఎక్సైజ్‌ శాఖ అధికారులు చర్చించారు. అన్ని రకాల ఎంఎన్‌సీ బ్రాండ్లకు అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది.

రోజు వారి మెనూ, ధరలు ఇలా.. 
ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదటి వారంలో ప్రముఖ బ్రాండ్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఎన్నికల సమయంలో నాణ్యమైన మద్యం తక్కువ ధరలకే అందిస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. అందులో భాగంగా ఇక నుండి బ్రాండ్‌ మద్యం తక్కువ ధరకే అందనుంది. తక్కువ ధర కేటగిరీలో ప్రముఖ బ్రాండ్ల క్వార్టర్‌ బాటిల్‌ను రూ.80 నుంచి రూ.90 కే అమ్మాలని ప్రభుత్వం భావిస్తోంది. ధర తగ్గినా నాణ్యత మాత్రం బాగుండేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రముఖ బ్రాండ్ల మద్యం అందుబాటులో లేకుండా పోయింది. నూతన పాలసీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం గతంలో ఉన్న ప్రీమియం బ్రాండ్లను తిరిగి అమ్మకాలు చేసుకొనేందుకు వీలుగా అనుమతులు మంజూరు చేస్తోంది. వైసీపీ ప్రభుత్వం మద్యం దుకాణాల నిర్వహణలో అమలు చేసిన విధానాల్లోనూ మార్పులు చేయనున్నారు. తిరిగి ప్రయివేటు వ్యక్తులే మద్యం దుకాణాల నిర్వహణకు అనుగుణంగా నిర్ణయం తీసుకోనున్నారు. అదే సమయంలో ధరలు తగ్గించటం ద్వారా ఖజానా పైనా భారం లేకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుటోంది. వచ్చే మంత్రివర్గ సమావేశంలో నూతన మద్యం పాలసీకి ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలపనుంది.

Name*
Email*
Comment*