- శ్రీశైలం ఆరు గేట్లు ఎత్తివేత
అమరావతి, ఎక్స్ప్రెస్ న్యూస్;
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా నదికి మళ్లీ వరద పోటెత్తింది. దీంతో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. శ్రీశైలం జలాశయానికి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 6 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. నాగార్జున సాగర్ వైపు కృష్ణమ్మ ఉధృతంగా ప్రవహిస్తోంది. శ్రీశైలం స్పిల్ వే ద్వారా 1.67 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు 1.64 లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. శ్రీశైలం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 884.4 అడుగులుగా ఉంది. శ్రీశైలం గరిష్ఠ నీటినిల్వ 215.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 212.9 టీఎంసీలుగా ఉంది. శ్రీశైలం ప్రాజెక్టు కుడి, ఎడమ కేంద్రాల్లో విద్యుత్ ఉత్పత్తి ముమ్మరంగా కొనసాగుతోంది. విద్యుత్ ఉత్పత్తి చేసి 67,631 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు. ఈ క్రమంలో సాగర్ పరివాహక ప్రాంత ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు.