ఏచూరి సీతారాం మృతికి సంతాపం తెలియజేసిన కార్మికులు

9/13/2024 9:48:37 PM

- డాక్టర్ రెడ్డీస్ కార్మికులు, షాంపిస్టన్స్ కార్మికులు.

రణస్థలం: ఎక్స్ ప్రెస్ న్యూస్: సెప్టెంబర్: 13
కమ్యూనిస్టు యోధుడు కామ్రేడ్ సీతారాం ఏచూరి మరణం వామపక్ష, లౌకిక, ప్రజాస్వామ్య శక్తులకు, శ్రామిక వర్గానికి తీరనిలోటని సిఐటియు జిల్లా అధ్యక్షులు సి.హెచ్.అమ్మన్నాయుడు అన్నారు. శుక్రవారం పైడిభీమవరం పారిశ్రామిక ప్రాంతంలో డా.రెడ్డీస్, శ్యాంపిస్టన్స్ ప్లాంట్ -2 పరిశ్రమలు వద్ద, పైడిభీమవరం సిఐటియు కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి సంతాప సభలు నిర్వహించి నివాళి అర్పించారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు అమ్మన్నాయుడు పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2011 లో డా.రెడ్డీస్ కార్మికులు నిర్వహించిన సమ్మె పోరాటానికి సీతారాం ఏచూరి వచ్చి సంఘీభావం తెలిపి అండగా నిలబడ్డారని ఆ సమయంలో ఆయన ఎంపిగా ఉన్నారని గుర్తు చేసారు. కార్మిక-కర్షక పోరాటాల మార్గదర్శి అని సామ్రాజ్యవాదం, మతోన్మాదంపై రాజీ లేని యుద్దం చేసిన పోరాట యోధుడని అన్నారు.  వామపక్ష, లౌకిక, ప్రజాతంత్ర శక్తుల సమన్వయ రథ సారధిగా సీతారాం ఏచూరి దేశ ప్రజానీకానికి చేసిన కృషి అమోఘమైనదని, విద్యార్థి దశ నుండి మూడు దశాబ్దాలుగా ఏన్నో పోరాటాలకు ఊపిరి పోసిన ఆయన మరణం కష్టజీవులకు నష్టమని అన్నారు. ఎన్నో గడ్డు పరిస్థితులను అధిగమించి, అనేక త్యాగాలతో, జైలు జీవితానికి కూడా సిద్దపడి, పోరాట జెండాను ఎగుర వేసిన ఏచూరి మరణం నా లాంటి వారికి తీవ్ర బాధను, దిగ్భ్రాంతిని కలిగించిందని ఆవేదన వ్యక్తం చేసారు. పదవుల చుట్టూ పరిభ్రమిస్తూ, అధికారమే పరమావధిగా మెడలోని కండువాలను మార్చేసే నేటి రాజకీయాలు కాలంలో ప్రజాసమస్యలపై నిరంతరం పోరాడుతూ, సమసమాజం కోసం పరితపిస్తూ నమ్మిన సిద్దాంతం కోసం కడవరకు నిలబడ్డారని తెలిపారు.  12వ తరగతిలో సి.బి.ఎస్.ఇ సిలబస్ లో ఆలిండియా టాపర్ గా యూనివర్సిటీలో ఎ ప్లస్ విద్యార్థిగా గోల్డ్ మెడల్ సాధించారని, 8 బాషలలో మాట్లాడుతారని తెలుగు నేల నుండి ఉద్భవించి దేశ రాజకీయాలలో కీలకంగా వ్యవహరించారని తెలిపారు. ఢిల్లీలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి నాయకుడిగా, ఎస్.ఎఫ్.ఐ అఖిల భారత అధ్యక్షులుగా, 32 ఏళ్ల వయసులోనే సిపిఎం కేంద్ర కమిటీ సభ్యునిగా, పోలిట్ బ్యూరో సభ్యులుగా, ఉత్తమ పార్లమెంటు సభ్యునిగా, రచయితగా, సిపిఎం ప్రస్తుత ప్రధాన కార్యదర్శిగా ఆయన ఎంతో సేవ చేసారని, ఎంతోమంది వామపక్ష,ప్రజాతంత్ర నాయుకులను తయారు చేసారని, ఇతర దేశాల వామపక్ష నాయుకులు ఏచూరి గారి సలహాలు తీసుకునేవారని తెలిపారు. పార్లమెంటులో ఆయన చేసిన ఒక్కో ప్రసంగం ఒక్కో వ్యాసమని ఇంతటి గొప్ప వారు మన మధ్య నుండి దూరం కావడం అత్యంత బాధాకరమని అన్నారు. సీతారాం ఏచూరి నుండి ఎంతో నేర్చుకోవాలని, ఆయనను ఆదర్శంగా తీసుకొని ఆయన ఆశయాలు కోసం, సమసమాజం కోసం కృషి చేయడమే ఆయనకు నిజమైన నివాళి అని అన్నారు. ఆయనకు సంతాపంగా పైడిభీమవరం సిఐటియు కార్యాలయం వద్ద సిఐటియు జెండాను క్రిందికి దించి అవనతం చేసారు. ఈ సంతాప సభలో డా.రెడ్డీస్ లేబొరేటరీస్ వర్కర్స్ యూనియన్ నాయకులు పి.రామకృష్ణ, బి.సురేష్, టి.వీర్రాజు, పున్నాన.శ్రీను, సత్యన్నారాయణ, శ్యాంక్రగ్ పిస్టన్స్ (రింగ్స్) వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎమ్.అప్పలనర్సయ్య, నాయకులు ఎన్.నాగేశ్వరరావు,జీరు.రాము తదితరులు తదితరులు పాల్గొన్నారు.

Name*
Email*
Comment*