విశాఖపట్టణం, ఎక్స్ ప్రెస్ న్యూస్ : సెప్టెంబర్ 18 ః
రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ ఎండీ రాజాబాబు జిల్లాలోని ఇళ్ల స్థలాల లేఅవుట్లను పరిశీలించారు. బుధవారం జిల్లాకు విచ్చేసిన ఆయన ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకంలో చేపడుతున్న ఇళ్ల నిర్మాణాల లేఅవుట్లను సందర్శించారు. అక్కడ పరిస్థితులను గమనించారు. జిల్లా అధికారులకు తగిన ఆదేశాలు జారీ చేశారు. పర్యటనలో భాగంగా తంగుడుబిల్లి, గిడిజాల, జగన్నాథపురం, ముదపాక, గొల్లలపాలెం పరిధిలోని లేఅవుట్లను తనిఖీ చేసి అక్కడ నిర్మాణ పరిస్థితులను గమనించారు. జిల్లా గృహ నిర్మాణ శాఖ పీడీ డి. అఖిల దగ్గరుండి అన్ని లేఅవుట్లను చూపించారు. వాటి స్థితిగతులను ఎండీకి వివరించారు. ఇప్పటి వరకు జరిగిన నిర్మాణాలు, జియో ట్యాగింగ్, లబ్ధిదారుల వివరాలను తెలిపారు. ఇటీవల జిల్లాలో జరిగిన సమావేశాలు, తీసుకున్న నిర్ణయాల గురించి వెల్లడించారు. పర్యటనలో ఆయన వెంట జిల్లా గృహ నిర్మాణ శాఖ ఈఈ సత్యనారాయణ, డీఈలు, ఏఈలు తదితరులు ఉన్నారు.