ప్రధానితో చంద్రబాబు, పవన్ భేటీ

10/18/2024 2:07:33 AM


- హర్యాన ప్రమాణ స్వీకార వేదికపై 
- పలు అంశాలు చర్చకు వచ్చే అవకాశం 

 విశాఖపట్నం, వైజాగ్ ఎక్స్ ప్రెస్; 
సీఎం చంద్రబాబు..డిప్యూటీ సీఎం పవన్ హర్యానా వెళ్తున్నారు. హర్యానా నూతన ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు. ఆ తరువాత ఎన్డీఏ సమావేశంలో ఈ ఇద్దరు పాల్గొంటారు. జమిలి ఎన్నికల వేళ కేంద్రం వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల నేతలతో ఈ భేటీ కీలకం కానుంది. ప్రధాని మోదీతో చంద్రబాబు, పవన్ ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ భేటీ పైన రాజకీయంగా ఉత్కంఠ కొనసాగుతోంది. హర్యానాలో హ్యాట్రిక్ విజయం సాధించిన బీజేపీ కొత్త ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నూతన ముఖ్యమంత్రిగా నాయబ్ సింగ్ సైనీ ప్రభుత్వం నేడు కొలువు తీరనుంది. ఈ ప్రమాణ స్వీకారానికి ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలు హాజరు కానున్నాయి.  ఈ భేటీలో రానున్న రాష్ట్రాల్లో ఎన్నికలతో పాటుగా నాలుగు నెలల ఎన్డీఏ మూడో విడత పాలన గురించి చర్చించనున్నారు. జమిలి ఎన్నికల విషయంలో వ్యూహాల పైన ప్రధాని తమ భాగస్వామ్య పక్ష నేతలకు వివరించే అవకాశం ఉంది.   పవన్ కల్యాణ్ ఎన్డీఏ సమావేశానికి హాజరు కావటం ప్రత్యేకత సంతరించుకుంది. ప్రధానిగా మోదీ ఎన్నిక జరిగిన సమావేశంలో పవన్ ను ఉద్దేశించి ప్రధాని ప్రశంసించారు. ఇప్పుడు ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం కొనసాగుతోంది. చాలా కాలం తరువాత ప్రధానితో పవన్ భేటీ కానున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలను వివరించనున్నారు. అదే విధంగా మహారాష్ట్రలో తెలుగు ప్రజలు ఉన్న ప్రాంతాల్లో పవన్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటారని సమాచారం. కేంద్ర మంత్రుల తో పాటుగా ఎన్డీఏ పక్షాల సీఎంలు..డిప్యూటీ సీఎంలు హర్యానా చేరుకుంటున్నారు. హర్యానాలో బీజేపీ వరుసగా మూడో సారి అధికారం చేపడుతోంది.

Name*
Email*
Comment*